మంచినీటి సమస్యపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపించడం లేదు – ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తెలుగువెలుగు, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య
ప్రజలు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారనీ.. మంచినీటి సమస్యపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపించడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జల్ పల్లి డివిజన్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, వాటర్ వర్క్స్ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాా ఇంద్రాారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ఇది వాస్తవమని, అయితే ఈ సమస్యపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. “99 రోజుల ప్రగతి పాలన” పేరుతో కార్యక్రమాలు చేపట్టినా, క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదని విమర్శించారు. జల్ పల్లి ప్రాంతంలో గత నెల రోజులుగా బస్తీల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా మారిందని, ప్రజలు ప్రతిరోజూ ఫోన్ ద్వారా తమ ఇబ్బందులు తెలియజేస్తున్నారని తెలిపారు. సరైన సమయానికి నీటి సరఫరా లేకపోవడం, వారానికి ఒక్కసారైనా నీళ్లు రాకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో నీటి సరఫరా వ్యవస్థ సక్రమంగా ఉండేదని, అవసరమైన పరిమాణంలో నీళ్లు అందించేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే నీటి సరఫరా లేకపోయినా బిల్లులు మాత్రం వస్తున్నాయని, ఇది ప్రజలకు భారంగా మారిందని అన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. సమ్మర్ ముందే ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని హెచ్చరించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను వెంటనే గుర్తించి సమస్య పరిష్కరించాలనీ, అవసరమైతే నీటి సరఫరా పరిమాణాన్ని పెంచాలనీ, పాత బోర్లను మరమ్మత్తు చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త మోటార్లు ఏర్పాటు చేసి బస్తీల్లో కనీస నీటి సదుపాయం కల్పించాలన్నారు. పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్లో ఉచిత నీటి పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం, జల్ పల్లి వంటి పరిసర మున్సిపాలిటీలలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ కిషోర్, కాజా జోహార్ అలీ, డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేశ్వరరావు డిజిఎం, యాదయ్య మేనేజర్ నాగుల శ్రీనివాస్ మేనేజర్ , జన్పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకటరామ్, డి ఈ ఆయేషా సుల్తానా, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
