నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కుటుంబ సభ్యులు, నాయకులు
రంగారెడ్డి జిల్లా సింహంగా పేరొందిన ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య
స్వర్గీయ ఇంద్రారెడ్డి ప్రజలతో కలిసి మెలిసి ఉండే స్వభావం, అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వం ఆయనను ప్రజల హృదయాల్లో “ఇంద్రన్న”గా నిలిపిందని, రంగారెడ్డి జిల్లా టైగర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
చేవెళ్ల నియోజకవర్గం కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కుటుంబ సభ్యులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, శ్రేయోభిలాషులు, అభిమానులు, నాయకులు, తదితరులు స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రా రెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రా రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసిన గొప్ప ప్రజానాయకుడు అని పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి ప్రజాసేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకుని, గ్రామీణ ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ప్రజలతో కలిసి మెలిసి ఉండే స్వభావం, అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వం ఆయనను ప్రజల హృదయాల్లో “ఇంద్రన్న”గా నిలిపిందన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ వినమ్రతను వదలలేదని, ముఖ్యంగా రైతులు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో పరిపాలనా నైపుణ్యం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చి మంచి పేరు సంపాదించారని, ప్రజల సమస్యలపై వెంటనే స్పందించడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా మానవతా దృక్పథంతో ముందుకు సాగిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. అకాల మరణం తెలంగాణ రాజకీయాలకు తీరని లోటుగా నిలిచిందని, అయినప్పటికీ ఆయన ఆలోచనలు, సేవలు ఈ రోజుకీ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు. ప్రజల కోసం జీవించిన నాయకుడు మరణించడు… ఆయన జ్ఞాపకాలు, సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు.
