మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని చేనేత సహకార సంఘం తీరుపై స్థానిక కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా మగ్గం నేస్తున్నప్పటికీ అర్హులైన అనేకమంది కార్మికులకు నేటికీ సంఘంలో సభ్యత్వం కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి, చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్రావుకు వేరు వేరుగా వినతి పత్రం అందజేశారు. కొందరు వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని, కేవలం తమకు అనుకూలమైన వారికే సభ్యత్వాలు ఇస్తూ నిజమైన కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత సభ్యుల జాబితాలో 18 ఏళ్ల లోపు వారు, అర్హత లేని వారు ఉన్నారని, మరణించిన వారి వారసులకు సభ్యత్వాలు ఇవ్వడం లేదని కార్మికులు అదనపు కలెక్టర్, ఏడీ చేనేత జౌళి శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి సభ్యత్వాలను నిబంధనల ప్రకారం తొలగించపోవడంతో ఇతర ప్రాత్రాలకు మార్పులు చేయ్యకపోవడంతో సాధారణ కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, శిక్షణా కార్యక్రమాలను కోల్పోతున్నారని వివరించారు. తక్షణమే అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి సభ్యత్వంతో పాటు ఓటు హక్కు కల్పించాలని, సభ్యత్వ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కార్మికులు హెచ్చరించారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరిన వారిలో నాగరాజు, పున్న వెంకటేశం, రాపోలు ప్రభాకర్, భారత మృత్యుంజయ, గంజి శ్రీనివాస్, ముడుదుడ్ల రమేష్, కడవేరు శ్రీనివాస్, సంగిశెట్టి గణేష్, పొట్టబత్తుల వెంకటేష్ తదితరులు ఉన్నారు.
